మాఘ పురాణం - 4

మాఘ పురాణం - 4వ అధ్యాయము 


కుత్సురుని వృత్తాంతము:


పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.


పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.


కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.


ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు

.
“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.


మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనసున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. 

 

 ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.

ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.


ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.


ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.


శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.


శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.


కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.