మద్దిలేటి నరసింహస్వామి ఆలయం

ప్రకృతి అందం, చుట్టూ ఎప్పుడు నీటితో నిండి ఉండి పచ్చట వాతావరణంలో కొండలు కోణాల మధ్య వెలసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొండ లోయలో వెలసిన ఈ ఆలయంలో నరసింహస్వామి కొలువై ఉన్నారు. మరి ఆ స్వామి అక్కడ ఎలా వెలిసాడు? ఇంకా ఆ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మద్దిలేటి నరసింహస్వామి ఆలయ చరిత్ర

శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు తమ భార్యతో ఆనంద సమయంలో పాచికలు ఆడుతూ ఆ ఆటలో ఓడిపోతారు. ప్రభువుపై విజయాన్ని సాధించిన లక్ష్మీ వారు స్వామి వారిని హేళన గా మాట్లాడుతారు. అప్పుడు స్వామి వారు ఆ ప్రదేశాన్ని వదిలి స్వతహాగా ఉండేందుకు ఎర్రమల, నల్లమల కొండలలో ఒక ప్రదేశము కోసం అన్వేషణ చేస్తారు. ఆయన యాగంటి వద్ద శ్రీ ఉమా మహేశ్వర స్వామిని కలుసుకుని ఆయన నివాస స్థలము కోసం సలహా కోరుతారు. ఆయన కోరిక మేరకు ఉమా మహేశ్వర స్వామి వారు మద్దిలేరు కాలువ పక్కన వున్న ఆలయ ప్రదేశంలోకి నడిపిస్తారు.మద్దిలేరు కాలువ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్షపట్టణం ను కన్నప్ప దొర వారు పాలిస్తుంటారు. కన్నప్ప దొర ప్రతి శనివారం అడవికి వెళ్ళేవారు. అలా అడవిలో వెళుతున్నప్పుడు అతనికి ఒక ఉడుము ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అప్పుడు కన్నప్ప దొర ఆ ఉడుముని పట్టుకోవాలని తన సైనికులను ఆదేశించారు. ఆ సైనికులు అనేక మార్గాలో పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు. చివరికి ఆ ఉడుము కోమలి అని పిలవబడే పుట్ట ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ సైనికులు పుట్టను త్రవ్విస్తారు కానీ ఉడుము కనబడదు.కన్నప్ప దొర తిరిగి తన రాజ్యానికి చేరుకుంటారు.అదే రోజు రాత్రి స్వామి వారు రాజు యొక్క కలలో కనిపించి,ప్రొద్దున నీకు ఉడుములా కనిపించి పుట్టలోకి ప్రవేశించింది నేనే అని వెల్లడిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు వేద పండితులతో పుట్ట వద్దకు చేరుకొని స్వామి వారికి పూజలు చేస్తారు.రాజు వారు పూజలతో సంతోషించిన స్వామి వారు 10 సంవత్సరాల బాలుడి రూపంలో పుట్ట నుండి బయటకు వస్తారు.అప్పుడు రాజు వారు 10 సంవత్సరాల బాలుడిని ఎత్తుకొని మద్దిలేరు కాలువ దగ్గరకు తీసికొనివచ్చి కూర్చోబెట్టి పూజలు చేసిన తరువాత స్వామి వారు శిల రూపంలోకి మారిపోతారు.మద్దిలేరు కాలువ పక్కనే నరసింహ స్వామి ప్రత్యక్షంగా కనబడినందున ఈ స్థలం మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం అని పిలువబడింది.
ఈ క్షేత్రం ను బనగానపల్లె మండలం క్రిష్ణగిరి మెట్ట నుండి కాలినడకన లేదా బేతంచెర్ల మండలం RS రంగాపురం నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

ఈ ఆలయాన్ని ప్రతి శనివారం ఎక్కువమంది భక్తులు దర్శిస్తారు. సంతాన ప్రదాతగా ఈ లక్ష్మి నరసింహస్వామి భక్తుల హృదయాలలో నిలిచి ఉన్నాడు. సంతానార్థం ఇక్కడికి వచ్చిన దంపతుల కోసం ప్రతి శుక్రవారం రాత్రి ఇక్కడ ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేస్తారు.

ఇలా గుడిచుట్టూ ఎత్తైన కొండచెరియలు ఉండి ప్రకృతి శోభతో, మానసిక ప్రశాంతతకు నిలయంగా, పర్యాటక కేంద్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది